ఇప్పుడు జనసేన అడుగులు ఎలా ఉండబోతున్నాయో నని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీడీపీతో జత కడతారా.. వైసీపీతో వెళ్తోందా? లేకుంటే ఇంకా ఎవరితోనన్న కలిసి పోటీ చేస్తారా అన్నది అన్ని పార్టీలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.అయితే పవన్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఆయన మనసులో ఏముందో కూడా అర్థం కావడం లేదు.
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చిన పవన్ తర్వాత ప్రత్యేక హోదాను కేంద్రంలోని బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయితే టీడీపీతో మాత్రం సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తున్నారు. అడపాదడపా టీడీపీ లీడర్లపై కామెంట్లు చేసినా.. చంద్రబాబును మాత్రం ఏరోజు ఒక్క మాట కూడా అనలేదు. దీంతో ఆ పార్టీతోనే వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. జనసేనతో పొత్తు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయన ఓకే అంటే పొత్తు పెట్టుకునేందుకు రాష్ట్రంలోని పార్టీలే కాదు.. జాతీయ పార్టీలూ సిద్ధంగానే ఉన్నాయి. ఇందులో ముందుంది ఆమ్ ఆద్మీ పార్టీ. త్వరలోనే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారు. పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేజ్రీవాల్ తో భేటీ అయ్యేందుకు పవన్ కల్యాణ్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెల 28వ తేదీ తర్వాత పవన్ కల్యాణ్ తో కేజ్రివాల్ భేటీ కానున్నారు. ఇప్పటికే తమిళనాడులో కమల్ హాసన్ ను కేజ్రివాల్ భేటీ అయ్యారు. మరి పవన్ కల్యాణ్ తో కేజ్రివాల్ భేటీ ఎందుకో.. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.